DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు పొందిన వీజీఎస్, విక్రమ్, గైడ్ పబ్లిషర్స్ సంస్థలు పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ కాపీలను లీక్ చేసి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు విక్రయించడం ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాయని ఆరోపించారు. ఫిజిక్స్, గణితం సహా పలు సబ్జెక్టుల పుస్తకాలు వాట్సాప్ ద్వారా వ్యాప్తి చెందినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.1200 కోట్ల బకాయిలు ఇప్పటికీ పూర్తిగా విడుదల కాలేదని విమర్శించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి, పౌష్టికాహారానికి ఈ పథకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో: పాఠ్యపుస్తకాల లీక్పై వెంటనే విచారణ జరిపించాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి గరికపాటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. షాబీర్ భాష, సహాయ కార్యదర్శి ఎస్. శరత్ కుమార్, నాయకులు రంగస్వామి, ఈరేష్, నగర కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.
Admin
DNB News