DNB News - ఆంధ్రప్రదేశ్ / : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం చందన బ్రదర్ సర్కిల్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వై.టి. భీమరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కె. అజయ్ బాబు, రాష్ట్ర సమితి సభ్యులు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. చమురు ధరల పెంపు ప్రభావం రవాణా చార్జీలపై పడుతూ, కూరగాయలు, పప్పుదినుసులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కారణమవుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ రూపంలో అధిక పన్నులు విధిస్తున్నాయని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, చమురు ఉత్పత్తులపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ధరలను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి. ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్, దేవా, నరసింహులు, వీరేష్తో పాటు హమాలి, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News