DNB News - ఆంధ్రప్రదేశ్ / : సర్వే నెంబర్ 630లో 3.34 ఎకరాల భూమి ఆక్రమణపై క్షేత్రస్థాయి పరిశీలన – ఆధారాలు బయటపెడతామన్న ఎమ్మెల్యే.. ఆదోని గడ్డపై రాజకీయ పోరు మరోసారి ముదిరింది. భూ ఆక్రమణల విషయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి క్షేత్రస్థాయిలో ఆధారాలతో సహా స్పందించారు. గురువారం మండలంలోని సర్వే నెంబర్ 630లో 3.34 ఎకరాల దారి పరంపోగు భూమి ఆక్రమణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోనిని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. 2019 నుండి 2024 వరకు ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జాలను దశలవారీగా బట్టబయలు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వే నెంబర్ 630 వివాదం: సర్వే నెంబర్ 630లో సుమారు 3.34 ఎకరాల భూమిని వైసీపీ అనుచరులు కబ్జా చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. దోషులను బయటపెడతాం: ప్రజల ఆస్తులను ఆక్రమించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని, ఆక్రమణదారులను ప్రజల ముందే దోషులుగా నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేకు చురకలు: మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని ఉద్దేశిస్తూ “వయసు పైబడింది… హరే రామ, హరే కృష్ణ అంటూ ఇంట్లో పిల్లలతో గడుపుతూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. రాజకీయాలు మాకు వదిలేయండి” అంటూ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించారు. అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన: కేవలం మాటలకే పరిమితం కాకుండా రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వివాదాస్పద భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషపణి, వీఆర్వోలు రాజశేఖర్ గౌడ్, ఈరన్న, సర్వేయర్ హరికృష్ణ, ఆర్ఐ లక్ష్మన్నతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News