DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ను విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి శ్రీ ఏకే రవి కృష్ణ ఐపిఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్లలో ఈ తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ మెగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది కలిపి మొత్తం 240 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వాహనాలు మరియు అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు. మొత్తం 870 మంది వ్యక్తులను మరియు 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 35 లిక్కర్ బాటిల్స్ను సీజ్ చేసి ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. అక్రమంగా తయారు చేస్తున్న 1000 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను మరియు 300 లీటర్ల నాటుసారాను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని పోలీసులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు ఇంచార్జ్ డిఎస్పీ ఉపేంద్రబాబు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.
Admin
DNB News