DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో 22ఏ, చుక్కల భూములు, ఇనాం నుండి పట్టా, వెబ్ ల్యాండ్ కరెక్షన్ వంటి పెండింగ్ రెవెన్యూ సమస్యలను డ్రైవ్ మోడ్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్కు చెందిన రెవెన్యూ అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ కీలక సూచనలు చేశారు. రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెరగేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ క్లినిక్స్, స్పెషల్ క్యాంపులు, డివిజన్ వారీ కాన్ఫరెన్స్ల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆదోని డివిజన్లో ఇనాం నుండి పట్టా, 22ఏ నిషేధిత భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, రైతులు భూముల విక్రయ సమయంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ వీటిని సుమోటోగా పరిష్కరించాలని సూచించారు. వెబ్ ల్యాండ్ కరెక్షన్లు, చుక్కల భూముల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయి విచారణలకు ముందు రైతులకు ముందస్తు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 24న గ్రామ సభలు నిర్వహించి ఇతరులు, అన్ క్లెయిమ్డ్ భూముల అంశాలపై వివరాలు తెలియజేయాలని చెప్పారు. ఐవీఆర్ఎస్ పబ్లిక్ పర్ సెప్షన్ సూచికలో రెవెన్యూ శాఖకు పాజిటివ్ రేటింగ్ వచ్చేలా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీని వంద శాతం పూర్తి చేయాలని, డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీ సర్వే ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, మార్చి 15 నాటికి అన్ని పెండింగ్ పిటిషన్లు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ ఫీల్డ్కు వెళ్లి రైతుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ రోజు 2,000 ఇనాం నుండి పట్టా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News