DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణానికి చెందిన బి. జాఫర్ తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ను ఆశ్రయించి పోలీసు రక్షణ కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. తాను ఆదోని షాహీ జామియా మసీదు ఆస్తులపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికార వినియోగంపై గత ఒక నెలగా నిరంతరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సరైన పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా ఎన్నికలు జరగకపోవడానికి కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించిన జాఫర్, ఈ విషయంపై ఇటీవల సబ్-కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు రెండు సార్లు మీడియా సమావేశాల ద్వారా సమస్యను ప్రజల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవలి మూడు రోజులుగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ ద్వారా చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించి, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.
Admin
DNB News