DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఉద్యమ గాయకుడు మేలన్న అకాల మరణం పట్ల ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన గానంతో ప్రజల్లో చైతన్యం నింపిన మేలన్న గుండెపోటుతో మరణించడం ఉద్యమానికి తీరని లోటుగా మిగిలిందని నాయకులు పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 108వ రిలే నిరాహార దీక్ష సందర్భంగా మేలన్న కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి మృతదేహానికి నివాళులు అర్పించారు. అలాగే ప్రభుత్వం మేలన్న కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేసింది. కర్నూలు పశ్చిమ ప్రాంతమైన ఆదోని ప్రాంతంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యసేవలు అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హోసూరు గ్రామానికి చెందిన వ్యక్తి అత్యవసర చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పటికీ తగిన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఖరీదైన ఇంజక్షన్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా కర్నూలుకు రిఫర్ చేయడం సరైంది కాదని విమర్శించారు. ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రాంతాలను కేంద్రంగా తీసుకుని ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంగా మారితే నాణ్యమైన వైద్యం, ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పడి వలసలు తగ్గుతాయని జేఏసీ నాయకులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఆదోని జిల్లాను ప్రకటించాలని, లేకపోతే ప్రజల్లో ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూదెప్ప, రామాంజనేయులు, పి.ఎస్. వీరేష్, కుమార్ (వైఎస్సార్ నగర్), వీరేష్ దత్తు తదితరులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అలాగే జేఏసీ నాయకులు టీ. వీరేష్, పగడాల కోదండ, వైపి నాగరాజు, గోవిందు, బండారి హనుమంతు, గుమ్మాల బాలస్వామి, రామచంద్రయ్య, సుభాష్ చంద్రబోస్, సుజ్ఞానమ్మ, జగన్, మలిగే రామలింగయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News