DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఉర్దూ గర్ల్స్ కాలేజీని ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలేజీ భవనం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ వినియోగంలోకి తీసుకురాకపోవడంతో మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయని SDPI పేర్కొంది. తలుపులు, కిటికీలు, లైట్లు వంటి సౌకర్యాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల 15 రోజుల క్రితం SDPI ప్రతినిధి బృందం కాలేజీ ప్రాంగణాన్ని సందర్శించగా భద్రత పూర్తిగా లేనట్టు గుర్తించిందని తెలిపింది. కాలేజీ ప్రాంగణంలో మద్యం సీసాలు కనిపించడం, ఆస్తి నష్టం జరగడం వంటి ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించింది. అదే విధంగా, సుమారు 100 మంది విద్యార్థులు కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి తమ సమస్యలను తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీ ప్రారంభం కాకపోతే దాదాపు 200 మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన బాలికల విద్యకు పెద్ద ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం బోధన సిబ్బంది నియామకం లేకపోవడం వల్ల కాలేజీ ప్రారంభం ఆలస్యం కావడం అన్యాయమని SDPI విమర్శించింది. SDPI, ఆదోని డిమాండ్లు: ఈ విద్యా సంవత్సరంలోనే ఉర్దూ గర్ల్స్ కాలేజీని తక్షణమే ప్రారంభించాలి కాలేజీ ఆస్తులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి అదనపు సూచనలు: వెంటనే వాచ్మన్ను నియమించాలి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి కాలేజీ చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించాలి ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని SDPI కోరింది. అలాగే జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని SDPI, ఆదోని డిమాండ్ చేశారు.
Admin
DNB News