DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని All India Students' Federation (AISF) కర్నూలు జిల్లా సమితి డిమాండ్ చేసింది. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ఎదుట రోడ్డుపై కూర్చొని పుస్తకాలు చదువుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. షాబీర్ భాష మాట్లాడుతూ, పీజీ విద్యార్థుల హక్కులను దెబ్బతీస్తూ ఉన్నత విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్న జీవో నెంబర్ 77ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో అమలుతో పీజీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, ఉన్నత విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, సిబ్బంది లోటుతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న 3480 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారని, పరిశోధన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని, విశ్వవిద్యాలయాల ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ప్రైవేట్ యూనివర్సిటీలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అధిక ఫీజుల వసూళ్లు, అక్రమ ప్రవేశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టకపోతే సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందని హెచ్చరించారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి Nara Lokesh యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని, ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసి సరిపడ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సోమన్న, నగర అధ్యక్ష కార్యదర్శులు అభి, అశోక్, నాయకులు వీరాంజనేయులు, రఘు, అఖిల్, షాహిద్, వీరేష్, ప్రేమ్, నూర్, విష్ణు, గోవర్ధన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News