DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో యూనిట్ ఇంచార్జీలకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బీటీ నాయుడు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కేడర్కు దిశానిర్దేశం చేస్తూ నూతనోత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాసేవే ప్రధాన ధ్యేయంగా కొనసాగుతోందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, చరిత్ర, సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి యూనిట్ ఇంచార్జి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొన్న బీటీ నాయుడు, నాయకత్వం సూచించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యూనిట్ ఇంచార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News