DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా టిడిపి కార్యాలయం నిర్మాణంపై వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని జిల్లా టిడిపి అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ సూచించారు. టిడిపి శాశ్వత భవనం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించామని తెలిపారు. అయితే ఆ కార్యక్రమంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్య ప్రచారమేనని మండిపడ్డారు. గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ.. టిడిపిపై విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు అలవాటైపోయిందన్నారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “రెండు ఎకరాల స్థలంలో టిడిపి కార్యాలయం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు” అని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అది రెండు ఎకరాలు కాదని, ఒకటిన్నర ఎకరాల స్థలం మాత్రమేనని తెలిపారు. ఆర్ & బి క్వార్టర్స్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలని ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఇది కొత్త అంశం కాదని, గత పది సంవత్సరాలుగా పార్టీ పెద్దలు, అప్పటి జిల్లా అధ్యక్షులు, నాయకులు ఈ స్థలం కోసం ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీకి శాశ్వత కార్యాలయం అవసరమనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. టిడిపి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. “వందేళ్లు దాటిన చెట్లను తొలగించి పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నారు” అనే వ్యాఖ్యలపై కూడా స్పందించిన ఆయన, అది పూర్తిగా అసత్యమన్నారు. తమ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అభివృద్ధి మరియు ప్రకృతి మధ్య సమతౌల్యం పాటిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని రాజకీయ విమర్శల కోసం వక్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు.. ఎవరు కేవలం అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు.
Admin
DNB News