DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపడుతున్న నిరసనల నేపథ్యంలో, కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అంగన్వాడీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా AITUC ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు జానకి, రాష్ట్ర సమితి సభ్యురాలు గౌసియా, ట్రెజరర్ గీతాదేవి, ప్రభావతి, శంకరమ్మ, దేవలమ్మ, అధ్యక్షుడు టి.వీరేష్ తదితరులు ప్రధాన సమస్యలు మరియు డిమాండ్లను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నామని ఆది కృష్ణమ్మ తెలిపారు. రెండు సార్లు వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, కేంద్రాల మౌలిక సదుపాయాల మెరుగుదల, తాగునీరు–మరుగుదొడ్లు–టీవీ–ఆర్వో సదుపాయాలు, 58 వేలకుపైగా సిబ్బందికి 5G స్మార్ట్ఫోన్ల పంపిణీ, గ్రాట్యుటీ అమలు, మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అంగన్వాడీ వర్గాల ప్రధాన డిమాండ్లలో కనీస వేతనం రూ.26,000 ఇవ్వడం, పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ కల్పించడం, గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన గైడ్లైన్స్ రూపొందించడం, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయడం, హెల్పర్ల ప్రమోషన్లకు నియమావళి రూపొందించడం, నాలుగు యాప్ల స్థానంలో ఒకే యాప్ అమలు చేయడం, మే నెలలో వేసవి సెలవులపై వెంటనే జీఓ జారీ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Admin
DNB News