DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 125 ఫిర్యాదులు అందాయి. ప్రధాన ఫిర్యాదులు ఇవి : పత్తికొండ లక్ష్మీనగర్కు చెందిన లోకేష్ బాబు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన చిన్న లక్ష్మన్న, ఎమ్మిగనూరు టౌన్లోని తన ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్ద రూ.1 లక్ష 10 వేల ఫోన్పే చేయించుకుని, రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేశారు. కర్నూలు బాలాజీ నగర్కు చెందిన మన్సూర్ అహ్మద్, రైల్వే, ఇన్కమ్ ట్యాక్స్, నామినేటెడ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఢిల్లీ, ముంబాయికి చెందిన వ్యక్తులు రూ.20 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన విజయకుమార్, వృద్ధాప్యం మరియు అనారోగ్యంతో ఉన్న తనను కుమారుడు రవి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని న్యాయం చేయాలని కోరారు. కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ ఉల్లా, తనపై చెడు ప్రయోగాలు చేసి ఆరోగ్యం క్షీణింపజేశారని, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
Admin
DNB News