DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్న డిప్యూటీ డీఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ—పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తమ పాఠశాలలో చేర్పించాలని ఒత్తిడి తెస్తూ, పుస్తకాలు, టై, బెల్ట్ పేర్లతో తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ డీఈఓ తన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ అనేకమంది కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. డిప్యూటీ డీఈఓ తన నివాసాన్ని కార్యాలయంగా మార్చుకుని అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఏ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయాలన్నా సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి, సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.
Admin
DNB News