DNB News - ఆంధ్రప్రదేశ్ / : కాల్వబుగ్గలోని బుగ్గ రామేశ్వరం స్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును కర్నూలు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 4 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వెల్లడించారు. ఈ చోరీ ఘటన 16/17.03.2026 తేదీల్లో ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్వబుగ్గలో జరిగింది. మొత్తం ఐదుగురు నిందితులు కలిసి ఆలయంలోకి చొరబడి సుమారు 10 కిలోల వెండిని దొంగలించినట్లు విచారణలో తేలింది. ఇందులో భాగంగా ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలిన ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు: అర్జున్ పూనం కుంబ్హర్ (పుణె, మహారాష్ట్ర) అక్షయ్ జైసింగ్ ఠాకూర్ (చించ్వడ్, మహారాష్ట్ర) ఈ ఇద్దరిని 05.04.2026 సాయంత్రం అరెస్ట్ చేశారు. వీరు తమ సహచరులు జెర్నల్, అమిత్, బజరంగి లతో కలిసి ఈ నేరానికి పాల్పడ్డారని ఒప్పుకున్నారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా నెల్లూరు జిల్లా దుత్తలూరు పరిధిలోని నర్రవాడ ఎల్లమ్మ గుడిలో జరిగిన చోరీ కేసులపై కూడా విచారణ కొనసాగుతోంది. నిందితుల వద్ద నుండి వెండి నాగాభరణం ముక్కలు, వెండి సింహం విగ్రహ భాగాలు, అమ్మవారి పీటం ముక్క, ధారాపాత్ర వంటి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన బోల్ట్ కట్టర్, స్క్రూడ్రైవర్లు, గ్లౌజులు, అలాగే Maruti Suzuki Wagon R (MH14JR4662) వాహనం మరియు OnePlus, VIVO T2X 5G మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గూగుల్ మ్యాప్ సహాయంతో ఆలయాల స్థానాలను గుర్తించి, రాత్రి సమయంలో తాళాలు కట్ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. టోల్ గేట్లలోని సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ బృందంలో కర్నూలు రూరల్ సీఐ ఎం. చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, కె.నాగలపురం ఎస్ఐలు పాల్గొన్నారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి, వారికి రివార్డులు ప్రదానం చేశారు. ప్రజలకు విజ్ఞప్తి: ఆలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసులు సూచించారు.
Admin
DNB News