DNB News - ఆంధ్రప్రదేశ్ / : రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా పారదర్శకంగా పూర్తి చేయాలి నందవరం గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రైతుల సమస్యలు తెలుసుకొని సర్వే సిబ్బందికి పలు సూచనలు చేసిన జేసీ జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. గురువారం నందవరం మండలం నందవరం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వ్యవసాయ భూములను సందర్శించి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. భూ సరిహద్దుల నిర్ధారణ, ఫీల్డ్ మ్యాపింగ్, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి, సర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, సందేహాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే కార్యక్రమం ద్వారా రైతులకు భూసంబంధిత వివాదాలు లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యమని జేసీ పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఖచ్చితత్వంతో, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, రైతుల సమక్షంలోనే భూ సరిహద్దులను నిర్ధారించాలని సర్వే బృందానికి సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి అభ్యంతరాలను వెంటనే నమోదు చేసి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ రికార్డులను ఆధునీకరించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అబ్దుల్ వహాబ్, ఉప తహశీల్దార్ మహేష్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాస రాజు, రెవెన్యూ సర్వే అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Admin
DNB News