DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలో జనరద్దీ అధికంగా ఉండే రైతు బజార్లు, మార్కెట్ యార్డులు, పూల బజార్ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు. సోమవారం ఆయన కొండారెడ్డి బురుజు సమీపంలోని పూల బజార్, సి. క్యాంపు రైతు బజార్, వినాయక ఘాట్ వద్ద కే.సీ. కెనాల్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిత్యం ప్రజల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడా గార్బేజ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి, అదనపు సిబ్బందిని నియమించి విధులు కేటాయించాలని ఆదేశించారు. కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీలలోనే చెత్తను వేయేలా వ్యాపారస్తులు, నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు కూడా పరిశుభ్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పనుల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేస్తూ, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు రమేష్, జిలానీ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News