DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో పెండింగులో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులపై పడుతున్న ఆర్థిక ఒత్తిడిని తొలగించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆదోని శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.5,800 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వకపోవడం, డిగ్రీలు పూర్తి చేసిన సుమారు 7 లక్షల మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందలేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన G.O.Rt.No.123, Higher Education Department, తేదీ 15-07-2024 ప్రకారం ఫీజులు చెల్లించకపోయినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, చాలా కళాశాలలు ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా G.O.Ms.No.72, Social Welfare Department, తేదీ 05-10-2014 ప్రకారం ప్రతి త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లోపు ఫీజులు విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని ఉన్నప్పటికీ, ప్రభుత్వం సమయానికి చెల్లింపులు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్న బకాయిలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఫీజు రీయంబర్స్మెంట్ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం రెండు విడతల్లో రూ.1,988 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగులో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవిందరాజ్, టౌన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు స్రవంత్ కుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News