DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏఈవో నర్సింహులు, ప్రైవేటు వ్యక్తి మోహన్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని ఈడిగ రంగన్న ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణ లైసెన్స్ రెన్యూవల్తో పాటు విత్తనాల విక్రయాల అనుమతి కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అనుమతులు మంజూరు చేయడానికి ఏఈవో నర్సింహులు రూ.35 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలు నమోదు చేసిన అధికారులు బుధవారం సాయంత్రం ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు ఏఈవో నర్సింహులు, ప్రైవేటు వ్యక్తి మోహన్కు రూ.30 వేల లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదనంగా మోహన్ వద్ద రూ.73 వేల అనధికార నగదు కూడా గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐ రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News