DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలో ప్రధాన రహదారుల డివైడర్లు, రోడ్ల పక్కన ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. శనివారం బుధవారపేట, సి.క్యాంపు, అమ్మ హాస్పిటల్ కూడలి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సుందరీకరణకు పరిశుభ్రమైన వాతావరణం ఎంతో అవసరమని అన్నారు. డివైడర్లలో పెరిగిన కలుపు మొక్కలు, చెత్తాచెదారం, ఎండిన కొమ్మలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రహదారుల పక్కన చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, పారిశుద్ధ్య సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రతిరోజూ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువలు, డ్రైన్లలో పూడిక పేరుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. నగర పరిశుభ్రత పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, చెత్తను రోడ్లపై లేదా డివైడర్లలో వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News