DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం కపటి గ్రామానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేయనున్న MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి వాల్మీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక చర్యలు చేపడుతోందన్నారు. MSME పార్క్ ఏర్పాటు ద్వారా ఆదోని ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని, స్థానిక వ్యాపారవేత్తలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ పార్క్ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దిశ లభించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఆదోని నియోజకవర్గానికి రావడానికి మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. పరిశ్రమలు పెరిగితేనే యువతకు స్థిరమైన ఉపాధి, ప్రాంతానికి ఆర్థిక బలోపేతం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబురావు, విట్ట రమేష్ , కపటి మాధవ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News