DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై పోలీసుల కళ్ల ముందే రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో టీడీపీ గుండాలు దాడులు చేయడం అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలను పోలీసులు అడ్డుకోలేకపోవడం పోలీసుల చేతకానితనమా? లేక అధికార పార్టీకి దాసోహమా? అని ఆయన ప్రశ్నించారు. కొంతమంది అధికారుల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచక పాలన తప్పదని, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా పోతే శాంతి భద్రతలే ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ఇలాంటి దౌర్జన్యాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అనుకుంటే అది వారి భ్రమ మాత్రమేనని స్పష్టం చేశారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు తలక్రిందులు అవుతాయని, నారా లోకేష్ దేశం విడిచిపోతారని, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్లో బిజీగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ రోజు మీరు చేసిన ప్రతి చర్య డిజిటల్ బుక్లో రికార్డు అవుతుందని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కనీసం ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించాలని, ప్రధాని , కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఎర్రకోట రాజీవ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News