DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా 70 రోజులుగా కొనసాగుతున్న దీక్షల సందర్భంగా ఈ రోజు ఐదు నియోజకవర్గాల్లో నిర్వహించిన బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని విద్యార్థి సాధన జిల్లా జేఏసీ సెంట్రల్ కమిటీ కన్వీనర్ తిరుమలేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ఆదోని ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు అందాలంటే తప్పనిసరిగా ఆదోని జిల్లాగా ఏర్పడాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లా ఏర్పాటు అయితేనే ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు అయ్యే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఈ బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశాయని తెలిపారు. పార్టీ, కుల, మత భేదాలు లేకుండా ప్రజలంతా జిల్లా సాధన కోసం ఒక్కటై ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆదోని జిల్లా సాధన వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
DNB News