DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, విద్యార్థుల డిమాండ్లను పూర్తిగా విస్మరిస్తూ వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని వివిధ విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. “రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అనంతరం ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ప్రెస్ మీట్లో AISF జిల్లా ప్రధాన కార్యదర్శి షబీర్ భాష, BDSF రాష్ట్ర కార్యదర్శి రమేష్, PDSU రాష్ట్ర కోశాధికారి సోమశేఖర్, DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ— ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత విడ్డూరమని అన్నారు. అలాగే ఆరెకల్ సమీపంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు , అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రాయలసీమకు ఏమి చేశారని ముక్కుసూటిగా ప్రశ్నించారు. రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ఆదోని జిల్లాగా ప్రకటించకపోవడం, మెడికల్ కళాశాలను ప్రభుత్వాధీనంలోకి తీసుకోకపోవడం, నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతంలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
Admin
DNB News