DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఓర్వకల్లును రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. శ్రీ మాత్రే ఫుడ్స్ ఆధ్వర్యంలో రూ.10 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న ఆధునిక గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు మంత్రి టీజీ భరత్ గుప్తా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఓర్వకల్లులో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అరటి, జామ, ఫ్రూట్ పల్ప్తో పాటు పలు వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయనున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ ద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెరగడంతో పాటు ప్రత్యక్ష, పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఓర్వకల్లుకు రానున్న రోజుల్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ గుప్తా స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి ద్వారా కర్నూలు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
Admin
DNB News