DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్)లో పెండింగ్లో ఉన్న మ్యాపింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బి.ఎల్.ఏలు) తమ పూర్తి జాబితాను సమర్పించాలని పాణ్యం నియోజకవర్గం ఎన్నికల అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8 మరియు ఎస్.ఐ.ఆర్కు సంబంధించిన ఎన్నికల అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న వాటిలో కొంతమంది ఓటర్లు పక్క నియోజకవర్గాలకు చెందినవారని గుర్తించినట్లు వివరించారు. ఫారం-7 కింద ఇప్పటివరకు సుమారు 2800 మంది ఓటర్ల తొలగింపు ప్రక్రియ పూర్తయ్యిందని, అందులో 1900 మంది డబుల్ ఓటర్లుగా గుర్తించి వారి అభ్యర్థన మేరకు ఒక చోట ఉన్న ఓటును తొలగించినట్లు తెలిపారు. అదేవిధంగా, స్థిర నివాస మార్పు కారణంగా కొంతమంది ఓటర్లు జాబితా నుంచి తొలగించబడగా, సుమారు 350 మంది మరణించిన ఓటర్ల పేర్లు కూడా తొలగించినట్లు చెప్పారు. ఫారం-6 ద్వారా సుమారు 4000 మంది కొత్త ఓటర్లు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం కోసం రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు మరియు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Admin
DNB News