DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలోని ఏ, బి, సి క్యాంపు క్వార్టర్స్లో అనధికారికంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో కలిసి ఆర్ అండ్ బి, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏబీసీ క్యాంపు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందుకు అనధికారిక ఆక్రమణలను తొలగించడం అవసరమని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఖాళీ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి మాట్లాడుతూ, ఏబీసీ క్యాంపు క్వార్టర్స్లో అనధికారికంగా నివాసముంటున్న వారు ఈ నెల 25వ తేదీలోపు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, ఆర్ అండ్ బి ఈఈ సునీల్ రెడ్డి, కర్నూలు అర్బన్ తహసీల్దార్ రవి, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News