DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా శనివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ను పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 42 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 42 సారా ప్యాకెట్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి ఆర్ కె రవి కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్డివిజన్లలో ఈ ఆపరేషన్ చేపట్టారు. పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు సబ్డివిజన్ల పరిధిలోని పలు గ్రామాలు, హాట్స్పాట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 162 మంది పోలీసు సిబ్బంది పాల్గొనగా, 500 ఇళ్లలో తనిఖీలు చేసి, 2,500 మందిని, 120 వాహనాలను పరిశీలించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 42 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ పరిసరాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే “ఆపరేషన్ వజ్రప్రహార్” ప్రధాన లక్ష్యమని, ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Admin
DNB News