DNB News - తెలంగాణ / : మధుమేహ వ్యాధి దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక వైద్య విధానాలు, తాజా పరిశోధనలపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీజీఆర్ఎస్ఎస్డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప అన్నారు. ఆదివారం కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)లో నిర్వహించిన "పంచమ్-2026" డయాబెటిస్ వైద్య శాస్త్రీయ సదస్సులో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్లు, వైద్య విద్యార్థులతో కలిపి సుమారు 800 మంది ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం మధుమేహం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందని, ఐసీఎంఆర్ అధ్యయనాల ప్రకారం దేశంలో మధుమేహం, ప్రీ-డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. తక్కువ వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో నివారణ, ముందస్తు గుర్తింపు, సమర్థవంతమైన చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో డయాబెటిస్ చికిత్సలో తాజా పురోగతులు, కొత్త చికిత్సా విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు, క్లిష్ట వైద్య పరిస్థితుల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు చర్చించడం వైద్య రంగానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శాస్త్రీయ చర్చలు, అనుభవాల మార్పిడి ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించగలమని ఆమె అన్నారు. మధుమేహ చికిత్సతో పాటు వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా వైద్యుల సామాజిక బాధ్యత అని డా. జి. దీప పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎల్ జాన్ ఇజ్రాయిల్, డాక్టర్ డీసీ తిరుపతి రావు, ఆర్గనైజింగ్ చైర్మెన్ డాక్టర్ ఎం విజయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ సిఎల్ ప్రసాద్, సీఈఓ రామచంద్రం రావు, డాక్టర్ రఘురామ రెడ్డి, డాక్టర్ కుమార్ నేత, ప్రతిమ జనరల్ వైద్య బృందం, మరియు విద్యార్థులు, ప్రతిమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News