DNB News - తెలంగాణ / : -దేశంలో ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ఐఎన్టీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు మండిపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను దాదాపు నాలుగు రూపాయల వరకు పెంచడం పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం వాహనదారులపై భారం పడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుందని అన్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం మరింత భారంగా మారుతోందన్నారు. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడి జీవించే ఆటో కార్మికులు, డ్రైవర్లు, కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. డీజిల్ ధరల పెంపుతో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతులపై అదనపు భారం మోపడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్ అనుకూల విధానాలతో ముందుకు సాగుతోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్పై అధిక పన్నులు విధించడం ద్వారా ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆవేదనను కేంద్రం గుర్తించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని కనకం సూరిబాబు హెచ్చరించారు.
Admin
DNB News