DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలో హృదయ విదారకరమైన సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి కథ అందరినీ కలచివేస్తోంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన గండేపల్లి మణికంఠ అనే విద్యార్థి స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం అతనికి వార్షిక పరీక్ష ఉండగా, అంతకుముందు రోజు శుక్రవారం తెల్లవారుజామున అతని తండ్రి గండేపల్లి కొండలరావు అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పితృవియోగాన్ని తట్టుకుని కూడా మణికంఠ తన భవిష్యత్తు కోసం ధైర్యంగా ముందుకు వచ్చి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఘటన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల హృదయాలను కలచివేసింది. కొండలరావు డిగ్రీ వరకు చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు కొనసాగించలేకపోయారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ భారం ఆయన భార్య శ్రీలక్ష్మి మీద పడింది. సరైన వైద్యం చేయించుకునే స్థోమత లేక వ్యాధి ముదరడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తాను ఉన్నత చదువులు కొనసాగించాలని ఉందని, దాతలు సాయం చేయాలని విద్యార్థి మణికంఠ కోరుతున్నాడు. ఈ ఘటన బత్తులపల్లి గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది.
Admin
DNB News