DNB News - తెలంగాణ / : దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మెడికల్ వీసాలతో భారత్లో కొనసాగుతున్న పది మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీ డ్రైవ్లో భాగంగా పీర్ఘర్హి చౌక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్కు చెందిన పది మంది వ్యక్తులు నకిలీ మెడికల్ వీసాలతో భారత్లో ఉంటున్నట్లు బయటపడింది. ఈ వ్యక్తులు మొదట మెడికల్ వీసాలపై భారత్కు వచ్చినప్పటికీ, వారి వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే అక్రమంగా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా సరైన ప్రయాణ పత్రాలు లేకపోయినా యూరప్ దేశమైన బల్గేరియాకు వెళ్లేందుకు మెడికల్ వీసాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం విదేశీయుల నమోదు కార్యాలయం అధికారులు వారి వివరాలను పరిశీలిస్తూ స్వదేశానికి పంపించే ప్రక్రియను ప్రారంభించారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులపై తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Admin
DNB News