DNB News - తెలంగాణ / : మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఉన్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు రసీదులలో యూరియా బస్తా 266, రూపాయలకు అమ్ముతున్నట్లు నమోదు చేస్తూ మూడు వందలకు విక్రయిస్తున్నారని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కొల్చారం మండలం అప్పాజీ పల్లి లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంటల నమోదు యాప్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మండలంలోని రంగంపేట, దుంపలకుంటలోని ఎరువుల దుకాణాలకు గత రెండు రోజుల క్రితం యూరియాసరఫరా కాగా బస్తా 300 రూపాయలు చొప్పున విక్రయించారని, ఈ విషయమై మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Admin
DNB News