DNB News - తెలంగాణ / : స్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. స్థానిక ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలుగు విభాగం మరియు సాహితీ సోపతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సాహిత్య రసజ్ఞులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉదయ సాహితీ సంస్థ గౌరవ అధ్యక్షులు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజం చైతన్యవంతమవుతుందని తెలిపారు. 1952 ఫిబ్రవరి 21న నేటి ఢాక లో మాతృభాష కోసం ఉద్యమించిన విద్యార్థులను కాల్చి చంపిన ఘటనను స్మరించారు. మాతృభాష గొప్పతనాన్ని గుర్తించిన యూనెస్కో 1999లో ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు. మాతృభాషను ఎవరూ ప్రత్యేకంగా నేర్పరని, అమ్మ ఒడిలోనే అభ్యసిస్తామని, భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడానికి మాతృభాషే బలమైన సాధనమని పేర్కొన్నారు. తమ మాతృభాషలో ప్రావీణ్యం ఉన్నవారికే ఇతర భాషలలోనూ నైపుణ్యం సాధ్యమవుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, “కవిత్వం ద్వారా మనుషుల మధ్య అనుబంధాలు బలపడతాయి. కవిత్వం మానవత్వాన్ని పరిమళింపజేస్తుంది; అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి మార్గం వేస్తుంది” అని అన్నారు. మాతృభాష మన అస్తిత్వానికి ప్రతీక అని, భాషను కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని రక్షించుకోవడమేనని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సాహితీ గౌతమి కార్యదర్శి కొత్త అనిల్ మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవితంలో మారుతున్న సామాజిక పరిస్థితుల మధ్య మాతృభాషకు దూరం కాకూడదని సూచించారు. “మన భాషలో మనం మాట్లాడుతూనే మన సంస్కృతి చిరకాలం నిలుస్తుంది. ఉన్నతమైన ఉద్యోగాలు చేసినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన తెలంగాణ భాష కూడా దోహదపడింది” అని అన్నారు. సదస్సు కన్వీనర్ బూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కవిత్వం ఒక సామాజిక బాధ్యత అని, యువత తమ భావాలను కవిత్వ రూపంలో వ్యక్తీకరించి సమాజం బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులచే కవి సమ్మేళనం నిర్వహించారు. రసాయనశాస్త్ర అధ్యాపకులు మేజర్ రేళ్ల సంజీవ్ "తీయ తీయని పలవరింత" కవితతో కవిసమ్మేళనాన్ని ప్రారంభించారు. బి.ఎస్సీ విద్యార్థి సుమన్ “భూమి మాట్లాడుతుంది” కవితను వినిపించారు. ఆంగ్ల విభాగ సహాయాచార్యులు కట్టా వేణు తన “యాదికుంచుకోరా యాష్టపడక” శతకంలోని పద్యాన్ని చదివారు. ఎం.ఏ తెలుగు విద్యార్థి నరేష్ “నాలోని సంఘర్షణ”, వాసవి “గెలుపు ఓటమి”, రమ్య “మాతృభాష నా మాతృత్వం”, రంగస్వామి “ఎక్కడున్నావో సి.నా.రె.” కవితలను వినిపించారు. తెలుగు సహాయాచార్యులు డా. రాపర్తి శ్రీనివాస్ “మరువకూడదేపుడు మాతృభాష” కవితను చదివారు. హిందీ సహాయాచార్యులు కొమురారెడ్డి “గమ్యంలేని గమనమా” వచన కవితను వినిపించారు. డా. చైతన్య, జక్కని తేజస్విని, బోదాసు సంధ్యలు తమ కవితలను ఆవిష్కరించారు. అనంతరం కవిత్వ పఠనంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు విభాగ సహాయాచార్యులు డా. ప్రకాష్, డా. ఆర్. శ్రీనివాస్, మెట్టు వెంకటేశ్వర్లు, పి. శంకర్, డా. పాత అశోక్, డా. పుప్పాల చైతన్య, డా. తాటికాయల భోజన్న, చరిత్ర విభాగ సహాయాచార్యులు సుధాకర్, రామకిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులు చింత శ్రీనివాస్, విక్రమ్లు తమ తెలుగు అధ్యాపకుడు, ప్రస్తుత ప్రిన్సిపాల్ ఆచార్య కలువకుంట రామకృష్ణను గజమాలతో సత్కరించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది.
Admin
DNB News