DNB News - తెలంగాణ / : పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు ముందస్తుగా అడ్డుకట్ట వేయవచ్చని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ,మలేరియా వ్యాధుల నియంత్రణపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లాలో వెక్టర్ బార్న్ ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లా అధికారులు ఫీల్డ్ సందర్శనలు నిర్వహించే సమయంలో ఎక్కడైనా పారిశుధ్యం మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే వెంటనే సంబంధిత పంచాయతీ లేదా మున్సిపాలిటీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమలు నీటిలో పెరుగుతాయని, ఎక్కడా నీటి నిల్వలు ఉండకూడదని, తాగునీటి లీకేజీలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పొదలను తొలగించి దోమల పెరుగుదలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రజల్లో పారిశుధ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి వెక్టర్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని, మలేరియా, డెంగ్యూ కేసులను వెంటనే గుర్తించి చికిత్స అందించాలనిసూచించారు. ప్రతి గ్రామంలో మే నెలలోనే ఆయిల్ బాల్స్ సరిపడా నిల్వ ఉంచాలని, మండల స్పెషల్ అధికారులు తమ పర్యటనల్లో వాటి నిల్వలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పి.హెచ్.సీ స్థాయిలో అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు సిద్ధంగా ఉంచాలని, దీనికి డీఎంహెచ్ఓ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగ్యూ కేసులను తప్పనిసరిగా నోటిఫై చేయాలని, ఆ ప్రాంతాల్లో తక్షణ పారిశుధ్య చర్యలు, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న నిర్మాణ పనులు, ప్రాజెక్ట్ ప్రాంతాలను పరిశీలించి దోమల పెరుగుదలకు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వినియోగించాలనీ సూచించారు. గత చరిత్ర ఆధారంగా గుర్తించిన హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మిల్లర్లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని స్వీకరించే విధంగా చూడాలని, కొనుగోళ్లలో ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, డిపిఓ రాంబాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News