DNB News - తెలంగాణ / : - కరీంనగర్ కలెక్టరేట్ ముందు డెస్క్ జర్నలిస్టుల నిరసన - జర్నలిస్టుల నిరసనకు టిడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు కరీంనగర్: డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కో కన్వీనర్, జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపూరావు డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో డెస్క్ జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు హాజరై తమ న్యాయమైన డిమాండ్లను గట్టిగా వినిపించారు. ఈ సందర్భంగా హాజరైన కుడుతాడి బాపూరావు మాట్లాడుతూ.. జీవో 252 వెంటనే సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. పత్రికా రంగంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర అమోఘమని అన్నారు. వార్తలను సేకరించడం మాత్రమే కాదు, వాటిని సరిచూసి, విశ్లేషించి, సమగ్రంగా ప్రజలకు అందించడంలో డెస్క్ జర్నలిస్టుల కృషి అత్యంత కీలకమని వివరించారు. డెస్క్ జర్నలిస్టులు కూడా పత్రికా రంగంలో సమాన బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, వారికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, ఆరోగ్య బీమా, ప్రయాణ సౌకర్యాలు వంటి అంశాల్లో కూడా వారు వెనుకబడి పోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన డెస్క్ జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారి హక్కుల సాధన కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. జర్నలిస్టుల ఐక్యతే తమ బలం అని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఐక్యంగా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటంలో, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ముఖ్యమని వారు పేర్కొన్నారు. డెస్క్ జర్నలిస్టుల కృషి గుర్తింపు పొందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించి, తమ డిమాండ్లను వివరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డెస్క్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, నాయకులు సీహెచ్. వేణుగోపాల్ రావు, డెస్క్ జర్నలిస్టుల అడ్హక్ కమిటీ కన్వీనర్ పోలు సంపత్, కోకన్వీనర్లు అల్లాడి శ్రీనివాస్, బాడిసె సంపత్కుమార్, దాముక రాజశేఖర్, దుబ్బాక శ్రీనివాస్, బొమ్మరవేని బాలకృష్ణ, గంగిళ్ళ జీవన్రెడ్డి, గోసికొండ ప్రవీణ్, బోయిని సంపత్, అన్ని పత్రికల డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Admin
DNB News