DNB News - తెలంగాణ / : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతిష్ఠాత్మకంగా పోలీసుశాఖ రూపొందించిన మూడోవ విడత ‘అరైవ్.. అలైవ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని మిర్చి మార్కెట్ లో రైతులకు, ట్రకు డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరైవ్ అలైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి, రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రముఖులు, మీడియా, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్ఫోన్ వాడడం, మద్యం సేవించి నడపడం, సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్ లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్ టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
Admin
DNB News