DNB News - తెలంగాణ / : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనకు చెంప పెట్టు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు ద్వారా అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘సేవ్ తెలంగాణ...ఓట్ ఫర్ బీజేపీ’’అనే బీజేపీ నినాదానికి అనుగుణంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమన్నారంటే... ప్రజలారా! రేపు జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల తీర్పు తెలంగాణలో మార్పుకు సంకేతం కావాలి. అవినీతి, అరాచకాలు, మోసపూరిత హామీలతో అడ్డగోలు పాలన చేస్తున్న కాంగ్రెస్ పాలకులకు చెంప పెట్టు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో ఏం చేసారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మోసపెట్టడానికి ప్రయత్నించారు. బీజేపీ మాత్రమే స్పష్టమైన ఎజెండాతో, స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణతో ఎన్నికల్లో పాల్గొంటోంది. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతుందంటే కేంద్ర నిధులవల్లేనని గుర్తుంచుకోండి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇయ్యలేదు. ఇప్పుడు ప్రజల ముందున్న దారి ఒక్కటే. అవినీతిలో మునిగిన కాంగ్రెస్ పార్టీకి బలమైన హెచ్చరిక జారీ చేయాలి. తెలంగాణను దోచుకుతిన్న బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మొలవకుండా బొందపెట్టాలి. ప్రజలారా.... తస్మాత్ జాగ్రత్త..! బీఆర్ఎస్, కాంగ్రెస్ను నమ్మితే అధో:గతే. తెలంగాణ అభివృద్ధి కావాలంటే, మున్సిపాలిటీల్లో నిజమైన పాలన రావాలంటే, అవినీతి రహిత పరిపాలన కావాలంటే.. కమలం గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బిజెపి.
Admin
DNB News