DNB News - తెలంగాణ / : విస్తృత రోడ్లు, 24 గంటల త్రాగునీరు, విద్యుత్ తో, శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. బుధవారం ఖమ్మం నగర కార్పొరేషన్ ఆర్టీఓ కార్యాలయం వద్ద కోటి 46 లక్షల రూపాయల వ్యయంతో ఆర్టీఓ ఆఫీస్ నుంచి బైపాస్ రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు, విజయనగర కాలనీలో 50.85 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని విస్తృత రహదారులు, 24 గంటల తాగునీటి సరఫరా, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. శాంతియుత వాతావరణంతో పాటు పరిశుభ్రమైన నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలు ఖమ్మాన్ని ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి దేవుడు తగిన శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పేదలు, మధ్యతరగతి, ధనికులు అనే తేడా లేకుండా అందరికీ అవసరమైన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో ఖమ్మంకు రింగ్ రోడ్ ఏర్పాటు కానుందని, ట్రాఫిక్ సమస్యలు త్వరలో పరిష్కార మవుతాయని పేర్కొన్నారు. నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి డివిజన్లో సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టి ఖమ్మంను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ తుమ్మల అంటేనే అభివృద్ధి అని, ఖమ్మం నగరాన్ని నాలుగు వైపులా సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయిస్తూ సమాన అభివృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు. నగరంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మంత్రి ఎవరినీ నొప్పించకుండా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యూజీడీ పనులు జరుగుతున్నాయని, వెలుగు మట్ల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన పర్యావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, కేబుల్ బ్రిడ్జి, మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఖమ్మం నగరం ఆదర్శ నగరంగా మారుతుందని, మంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ నేడు రూ.50.85 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మంత్రి మార్గదర్శకత్వంలో నగర పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అన్ని డివిజన్లలో రోడ్డు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News