DNB News - తెలంగాణ / : హైదరాబాద్లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నాయకులు. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సీ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నాలుగో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కరచాలనం చేసి, అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్తో కొద్దిసేపు వారితో కలిసి మ్యాచ్ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ దేశంలో క్రీడల అభివృద్ధి విషయంలో ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. క్రీడలను కార్పొరేట్ లాభాల కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల్లా వేలం వేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. యువత మాదకద్రవ్యాలు, బెట్టింగ్ సంస్కృతి వంటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని, క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, పోరాటస్ఫూర్తి పెంపొందించే గొప్ప సాధనమని నారాయణ పేర్కొన్నారు. భగత్ సింగ్ ఆశయాలు యువతకు ప్రేరణ కావాలని, క్రీడలు మరియు విద్య ద్వారా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి మొలుగురం కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర సమస్యగా మారిందన్నారు. విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యలో ముందుండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత ముందుండాలని, ఈ దిశగా అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మరియు ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
DNB News