DNB News - తెలంగాణ / : రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణ వేగంగా కొనసాగుతోంది. ప్రజలకు సులభంగా, వేగంగా ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మీ సేవ వాట్సాప్/చాట్బాట్ ప్లాట్ఫామ్ ప్రస్తుతం 580కు పైగా సేవలను అందిస్తూ రాష్ట్రంలో ప్రముఖ డిజిటల్ సేవా వేదికగా నిలుస్తోంది. 2025 నవంబర్ 18న ప్రారంభమైన ఈ సేవలు తక్కువ సమయంలోనే విస్తృతంగా ప్రజాదరణ పొందాయి. ప్రజలు 8096958096 నంబర్కు వాట్సాప్ ద్వారా సందేశం పంపడం ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు. తాజాగా ఈ సేవల్లో భాగంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 12, 2026 నుండి విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. ఈ విధానంతో వెబ్సైట్లలో లాగిన్ కావడం లేదా మీ సేవ కేంద్రాలను సందర్శించడం అవసరం ఉండదు. ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు ఎస్సెస్సీ హాల్ టికెట్లను ఉచితంగా, తక్షణం అందించిన ఈ ప్లాట్ఫామ్, విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది. విద్యార్థులు తమ ఫలితాలను పొందేందుకు ముందుగా 8096958096 నంబర్ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకుని, వాట్సాప్లో “Hi” మెసేజ్ పంపాలి. అనంతరం “BIE Exam Result” సేవను ఎంపిక చేసి, తమ రోల్ నంబర్, సంవత్సరం (1వ లేదా 2వ సంవత్సరం), స్ట్రీమ్ (జనరల్ లేదా వొకేషనల్) వివరాలను నమోదు చేసి సమర్పిస్తే, ఫలితం వెంటనే వాట్సాప్లో అందుతుంది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మీ సేవ వాట్సాప్ సేవలు ప్రజలు ప్రతిరోజూ వినియోగించే డిజిటల్ వేదికల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికి చేరవేసే వినూత్న చర్యగా నిలుస్తున్నాయని తెలిపారు.
Admin
DNB News