DNB News - తెలంగాణ / : పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత అని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి మంగళగూడెం గ్రామంలో 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో కొత్తూరు నుండి కాచిరాజుగూడెం రోడ్డు, స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత పర్యటనలో ఈ ప్రాంతంలో వరదల సమస్యను స్వయంగా పరిశీలించి ప్రజలకు ఇచ్చిన హామీని నేడు నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కల్వర్టు నిర్మాణం నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గడిచిన రెండు సంవత్సరాల మూడు నెలల్లో 64 కోట్ల 92 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, సీసీ డ్రెయిన్లు తదితర పనులు చేపట్టినట్లు అన్నారు. మిగిలి ఉన్న సీసీ రోడ్లు, డ్రెయినేజ్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి తెలిపారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్, వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి దశ ఇళ్లను ఇప్పటికే మంజూరు చేసినట్లు, త్వరలో రెండో దశ ఇళ్లను కూడా మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ఇల్లు అందించే వరకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ దృష్టి ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం పైనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, పాలేరు నియోజక వర్గ ప్రత్యేక అధికారి రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News